అంతర్జాతీయ అవార్డు రేసులో విశాఖ మహానగరం మూడో స్థానాన్ని దక్కించుకుంది. స్పెయిన్లో జరిగిన స్మార్ట్ సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్ 2020లో విశాఖ స్మార్ట్ సిటీ ప్రపంచ నగరాలతో పోటీ పడింది. లివింగ్ అండ్ ఇన్క్లూజన్ అవార్డు కేటగిరిలో మోస్ట్ ఇన్నోవేటివ్ అండ్ సక్సెస్పుల్ ప్రాజెక్టులతో ప్రపంచంలోని 20 నగరాలు పోటీ పడగా.. విశాఖ మూడో స్థానంలో నిలిచింది. బీచ్ రోడ్డులో రూ.3.50 కోట్లతో నిర్మించిన ఆల్ ఎబిలిటీ పార్క్ లివింగ్ అండ్ ఇన్క్లూజన్ అవార్డుకు పోటీ పడింది. ఏడు కేటగిరీల్లో ఈ అవార్డులు ప్రకటించారు. మొత్తం ఈ ఎక్స్పోలో ప్రపంచం నలుమూలల నుంచి 46 నగరాలు పాల్గొనగా, భారత్ నుంచి కేవలం విశాఖపట్నం మాత్రమే అర్హత పొందడం విశేషం.
రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ ఎక్స్పోలో బుధవారం ఆయా కేటగిరీల్లో అవార్డులు ప్రకటించారు. తొలిస్థానంలో మురికివాడల అభివృద్ధి ప్రాజెక్టుతో బ్రెజిల్ విజేతగా నిలవగా, అంతర్జాతీయ విరాళాల ద్వారా పేదలకు సంబంధించిన వివిధ రకాల బిల్లుల్ని చెల్లించే ప్రాజెక్టుతో టర్కీ దేశంలో ఇస్తాంబుల్ సిటీ రెండో స్థానంలో నిలిచింది.