అమరావతి ఉద్యమకారులపై వైసిపి నేతలు వ్యాఖ్యలు చేయడం సరికాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తాడేపల్లి జనసేన కార్యాలయంలో అమరావతి పరిరక్షణ సమితి నేతలతో పవన్ కల్యాణ్ నేడు సమావేశమయ్యారు.. ఈ సందర్భంగా అమరావతి కోసం తాము చేస్తున్న శాంతియుత ఆందోళన వివరాలను పవన్ దృష్టికి తెచ్చారు జాక్ నేతలు. తమ ఆందోళనను వైసిపి నేతలు అపహాస్యం చేస్తున్నారని పేర్కొన్నారు.. దీనిపై స్పందించిన పవన్ బంగారం పెట్టుకొని ఉద్యమం చేయకూడదా? ఉద్యమం అంటే చిరిగిన బట్టలు వేసుకొనే ఉండాలా? అని ప్రశ్నించారు. . ఉద్యమానికి, సామాజిక వర్గానికి ముడిపెట్టడం సరికాదని అన్నారు. రాజధానిని మూడు ప్రాంతాల మధ్య సమస్యగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని భరోసా కల్పించారు. రైతులకు న్యాయం చేసే విషయంలో ఎప్పటికీ వెనకడుగు వేసేదిలేదని పవన్ స్పష్టం చేశారు. ”రాజధానిగా అమరావతే ఉంటుందని భాజపా నాకు స్పష్టం చేసింది. రాజదానిని తరలిస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా చెప్పలేదు. అధికారికంగా ప్రకటించాక మా పార్టీ కార్యాచరణ చెబుతాం” అని పవన్ కల్యాణ్ తెలిపారు.
అమరావతి ఉద్యమానికి పవన్ కల్యాణ్ భరోసా : శివారెడ్డి
అమరావతి ఉద్యమానికి సంబంధించిన అన్ని అంశాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్కు వివరించామని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలు తెలిపారు. పవన్ తో కలిసిన అనంతరం అమరావతి జేఏసీ నేత శివారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పవన్ సానుకూలంగా స్పందించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారన్నారు. బీజేపీతో కలిసి అమరావతి ఉద్యమంలోకి అవసరమైన సమయంలో వస్తామన్నారు. వీలైతే ప్రధాని మోడీ, అమిత్ షాలతో అపాయింట్మెంట్కు ప్రయత్నం చేస్తానని చెప్పారన్నారు. గతంలో ఢిల్లీలో అమరావతికి మద్దతుగా లాంగ్ మార్చ్ చేయాలని భావించామని తెలిపారు.