దేశంలో విద్యుత్ మౌలిక సౌకర్యాలు, సిబ్బంది సేవలపై నీతి ఆయోగ్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ‘ఎలక్ట్రిసిటీ యాక్సెస్ ఇన్ ఇండియా: బెంచ్ మార్కింగ్ డిస్ట్రిబ్యూషన్ యుటిలిటీస్’ పేరుతో కేంద్ర విద్యుత్ శాఖ, నీతి ఆయోగ్, రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, స్మార్ట్ పవర్ ఇండియా సంయుక్తంగా 10 రాష్ట్రాల్లో సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో లంచాలు తీసుకుంటున్న విద్యుత్ ఉద్యోగుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్ లో నిలిచింది. సర్వేలో పాల్గొన్న 57 శాతం మంది వినియోగదారులు తమకు ఇలాంటి పరిస్థితి ఎదురైందని చెప్పినట్లు నివేదిక పేర్కొంది.
విద్యుత్తు సమస్యలు తెలుసుకోవడానికి 10 రాష్ట్రాల్లోని 25 డిస్కంల పరిధిలో 25,116 మందిని సర్వేచేశారు. అందులో ఆంధ్రప్రదేశ్లో 1,809 మంది ఉన్నారు. వినియోగదారులకు అందుబాటు విషయంలో కర్ణాటక డిస్కంలు టాప్లో ఉండగా, ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ డిస్కం అట్టడుగున నిలిచింది. ఆంధ్రప్రదేశ్ లోని గృహ విద్యుత్తు వినియోగదారులు గ్రిడ్ కనెక్షన్, మౌలిక వసతులకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. తూర్పు డిస్కం పరిధిలోని వ్యవసాయ వినియోగదారులకు సరైన మౌలిక వసతులు లేవు. వాణిజ్య వినియోగదారులకు దక్షిణ డిస్కం పరిధిలో గ్రిడ్ కనెక్షన్ సమస్య ఉంది. దక్షిణ డిస్కం పరిధిలో కొత్త కనెక్షన్ల విషయంలో, తూర్పు డిస్కం పరిధిలో విద్యుత్తు నాణ్యత విషయంలో వినియోగదారులు అసంతృప్తితో ఉన్నారు.