ఆన్లైన్ సినిమాలు, ఆడియో విజువల్ ప్రోగ్రామ్స్, ఆన్లైన్ న్యూస్, కరెంట్ ఎఫైర్స్ కంటెంట్ లాంటివాటిని కేంద్ర సమాచార, ప్రసార శాఖ పరిధిలోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అంటే ఆన్లైన్లో వార్తలు అందించే పోర్టల్స్, కంటెంట్ ప్రొవైడర్స్ అందరూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ పరిధిలోకి వచ్చారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం కేంద్ర సమాచార, ప్రసార శాఖలోని నియమనిబంధనల్లో 22వ ఎంట్రీలో 22ఏ కింద ఆన్లైన్లో వచ్చే సినిమాలు, ఆడియో విజువల్ ప్రోగ్రామ్స్ని, 22బీ కింద ఆన్లైన్లో వార్తలు, కరెంట్ ఎఫైర్స్ ఇచ్చే ప్లాట్ఫామ్స్ని చేర్చింది. డిజిటల్, ఆన్లైన్ మీడియా పేరుతో ఈ ఎంట్రీలు చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది.
అంటే ఇకపై నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ కేంద్ర సమాచార, ప్రసార శాఖ పరిధిలోకి వచ్చినట్టే. ఇప్పటివరకైతే భారతదేశంలో డిజిటల్ కంటెంట్ను పరిశీలించేందుకు నియంత్రించేందుకు స్వయం ప్రతిపత్తిగల సంస్థగానీ, చట్టంగానీ లేదు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రింట్ మీడియాను, నేషనల్ బ్రాడ్క్యాస్టర్స్ అసోసియేషన్-NBA మానిటర్ చేస్తుంది. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటనల్ని చూసుకుంటోంది. ఇక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్-CBFC సినిమాల వ్యవహారాలను చూస్తోంది. అంతే తప్ప ఆన్లైన్లో, డిజిటల్ ప్లాట్ఫామ్లో వచ్చే వార్తలపై, ఓటీటీల్లో వచ్చే సినిమాలపై ఎలాంటి నిఘా, నియంత్రణ లేదు.
ఓటీటీ ప్లాట్ఫామ్స్ని నియంత్రించేందుకు స్వయంప్రతిపత్తిగల సంస్థను ఏర్పాటు చేయాలంటూ సుప్రీం కోర్టులో గత నెలలో ఓ పిటిషన్ దాఖలైంది. డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సినిమాలు, సిరీస్లు ఎలాంటి క్లియరెన్స్ సర్టిఫికెట్లు లేకుండా రిలీజ్ అవుతున్నాయని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం స్పందనను సుప్రీం కోర్టు కోరింది. కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖతో పాటు ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు సుప్రీం కోర్టు నోటిసులు కూడా జారీ చేసింది. అయితే అంతకన్నా ముందే మరో కేసులో డిజిటల్ మీడియాను రెగ్యులేట్ చేయడం అవసరం అని కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ సుప్రీం కోర్టుకు తెలిపింది.