కరోనా కారణంగా మన దేశంతో పాటు ప్రపంచంలోని అనేక సాఫ్ట్ వేర్ కంపెనీలు తమ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేసుకునే అవకాశం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టడంతో కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం చేసే ఉద్యోగులు మళ్లీ యథావిథిగా కంపెనీలకు రావాలని కోరుతున్నాయి. దీంతో ఇప్పటికే పలువురు ఉద్యోగులు కరోనా నిబంధనలు పాటిస్తూ ఆఫీసుల బాట పట్టారు. అయితే కొన్ని కంపెనీలు మాత్రం వర్క్ ఫ్రమ్ హోం ద్వారా సేవలు అందిస్తున్న తమ ఉద్యోగులకు మరికొన్ని రోజులు ఇదే విధంగా పని చేసే అవకాశం కల్పిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఐటీ దిగ్గజం విప్రో కూడా చేరిపోయింది.
భారత్తో పాటు అమెరికాలో ఉన్న తమ ఉద్యోగులంతా జనవరి 18, 2021 వరకు వర్క్ ఫ్రమ్ హోం ద్వారానే సేవలందించాలని విప్రో వెల్లడించింది. ఈ కంపెనీలో విధులు నిర్వహించే ఉద్యోగుల్లో ఎక్కువ మంది భారత్, అమెరికాలోని వారే. భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా.. కొన్ని ప్రాంతాల్లో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఇక అమెరికాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విప్రో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఈ మెయిల్ద్వారా ఉద్యోగులకు చేరవేసింది.
మరోవైపు మిగతా దేశాల్లో విధులు నిర్వహించే తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం పొడిగించే అంశాన్ని ఆయా దేశాల్లో కరోనా పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని కంపెనీ ప్రకటించింది. ఉద్యోగుల ఆరోగ్యమే తొలి ప్రాధాన్యమని కంపెనీ వెల్లడించింది. మరోవైపు భవిష్యత్తులో ఉద్యోగులంతా ఆఫీసుకి వచ్చి పనిచేయాల్సిన అవసరం ఉండకపోవచ్చునని విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్జీ కొన్ని నెలల క్రితం జరిగిన ఓ సమావేశంలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కంపెనీ మరోసారి వర్క్ ఫ్రమ్ హోం గడువును పొడిగించడం విశేషం.