చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం ఏటుకూరిపల్లె గ్రామానికి చెందిన శశికళకు నరేష్, నందిని సంతానం. ఆమె భర్త చనిపోవడంతో పిల్లలను తీసుకొని వచ్చి గ్రామంలోనే ఉంటుంది. నరేష్ ఐటీఐ చదవగా నందిని డిగ్రీ పూర్తి చేసింది. నందినికి ఇటీవల పెళ్లి సంబంధాలు చూశారు. తాను బాగా స్థిర పడ్డాకే పెళ్లి చేసుకుంటానని అప్పటి వరకు పెళ్లి చేసుకోనని ఇంట్లో చెప్పింది. అందుకు ఇంట్లో వారు ఒప్పుకోలేదు. మంగళవారం నందిని పుట్టిన రోజు. ఉదయం 10 గంటలకు ఇంట్లో పుట్టిన రోజు వేడుక చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు.
ఇంతలో నందిని మంగళవారం ఉదయం గ్రామ శివారులోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామ యువకులు పాతాళభైరవితో గాలించినా దొరకలేదు. చిత్తూరు నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మోటార్లతో నీళ్లు తోడి నందిని మృతదేహాన్ని బయటికి తీశారు. ఈ ఘటనతో అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి. పుట్టిన రోజే ఆ యువతికి చివరి రోజైంది అంటూ అంతా ఆవేదన వ్యక్తం చేశారు.