లాక్ డౌన్ అనంతరం ఏపీలో స్కూల్స్ తెరచుకోనున్నాయి. నవంబర్ 02 నుంచి పాఠశాలలు మళ్లీ తెరుచుకోనున్నాయి. సుమారు 8నెలల విరామం తర్వాత స్కూల్స్ తెరుకోనున్నాయి. ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి సురేశ్ ప్రకటన చేశారు. మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని స్కూల్స్ లో ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే ఆ స్కూల్స్ లో కరోనా విజృంభించడంతో కొత్త విధానాన్ని అవలభించాలని ఏపీ సర్కార్ నిర్ణయిస్తోంది.
సరి-బేసి విధానంలో విద్యార్థులకు తరగతులను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. 1,3,5,7,9 తరగతులకు ఒక రోజు, 2,4,6,8,10 తరగతులకు రెండో రోజు క్లాసులు నిర్వహించనున్నారు. 750 మంది కంటే ఎక్కువ ఉన్న పాఠశాలల్లో మూడు రోజులకొకసారి తరగతులు నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో పాఠశాలల పునః ప్రారంభం నవంబర్ 2న అని సీఎం జగన్ ఏర్పాటు చేశారు. నవంబరులో మధ్యాహ్నం ఒంటిగంట వరకే తరగతులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకే తరగతులు నిర్వహిస్తున్నా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నారు.
ఒకవేళ ఎలాంటి ఇబ్బందులు లేకపోతే పాఠశాల వేళలపై డిసెంబర్ లో మరో నిర్ణయం తీసుకోనుంది జగన్ సర్కార్. అయితే తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపకపోతే.. వారి కోసం స్కూళ్లు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. కరోనా వైరస్ ప్రబలిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలలు మూతపడిన సంగతి తెలిసిందే. కొన్ని విద్యాసంస్థలు అయితే ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. అయితే అన్ లాక్ 5.0 ఆంక్షలను సడలించింది కేంద్రం. విద్యాసంస్థలు, కళాశాలలు తెరిచే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలిపెట్టింది.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నుంచే స్కూళ్లను ప్రారంభించాలని ఏపీ సర్కార్ అనుకుంది. కానీ వైరస్ తగ్గుముఖం పట్టకపోవడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. అక్టోబర్ 5 నుంచి తెరవాలని భావించారు. అది కూడా వాయిదా పడింది. చివరకు నవంబర్ 02 నుంచి స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థులకు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు నాడు-నేడు పథకంలో భాగంగా పాఠశాలల్లో మౌళిక సదుపాయాలను మెరుగుపరచిన సంగతి తెలిసిందే.