ఓ వ్యక్తి డీజిల్ క్యాన్ రోడ్డుపైకి వచ్చాడు. అమాంతం ఒంటిమీద పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటల్లో కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ షాకింగ్ ఘటన విశాఖపట్నంలో జరిగింది. నగరంలోని గాజువాక ఏరియా శ్రీనగర్ రహదారిపై ఓ వ్యక్తి ఆత్మాహుతి చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతుడిని తెలంగాణకు చెందిన లారీ ఓనర్ నర్సిరెడ్డిగా పోలీసులు గుర్తించారు. డీజిల్ పోసుకుని నిప్పంటించుకోవడంపై ఆరా తీస్తున్నారు.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం డెలిమనేడుకు చెందిన నర్సిరెడ్డి(32) సొంత లారీ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత వారం మిర్యాలగూడ నుంచి ఒడిశా లోడుతో వెళ్లిన నర్సిరెడ్డి.. అటు నుంచి ఇసుక లోడుతో గాజువాక వచ్చాడు. ఇసుక అన్లోడ్ చేయకుండా శ్రీనగర్ రహదారిపై లారీ నిలిపి నిద్రించాడు. మిర్యాలగూడ వచ్చిన మరో లారీ డ్రైవర్ మధు.. నర్సిరెడ్డి లారీని కూడా తీసుకెళ్లి అన్లోడ్ చేయించుకుని తిరిగి వచ్చాడు.
రాత్రి వేళ భోజనం చేసిన తరువాత మధు తన లారీలో నిద్రించాడు. నల్గొండ నుంచి వచ్చిన లారీ డ్రైవర్లతో కలసి మధు కొద్దిదూరంలో పడుకున్నారు. ఉదయాన్నే నిద్రలేచిన నర్సిరెడ్డి సడెన్గా లారీలో ఉంచిన డీజిల్ క్యాన్తో రోడ్డుపైకి వచ్చాడు. ఒక్కసారిగా డీజిల్ తనపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటల్లో వ్యాపించి ఒళ్లంతా కాలిపోయి నర్సిరెడ్డి కిందపడిపోయాడు. అటుగా వెళ్తున్న పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా పలితం లేకపోయింది.