అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలం సామాన్యుడి నుంచి ధనవంతుడి వరకు నిత్యావసర సరకుల జాబితాలో ప్రధానంగా కనిపించేవి కూరగాయలు. ఇవి లేకుండా రోజు పూట గడవదు. కొనకా తప్పదు. ఇప్పుడిదే వినియోగదారులకు తంటాలు తెచ్చి పెడుతోంది. కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడింది. నిత్యావసరాలపైనా అది స్పష్టంగా కనిపిస్తోంది. కరోనా సంక్షోభంతో ఉపాధి కోల్పోయి కొందరు, ఆదాయం తగ్గి మరి కొందరు ఇబ్బందులు పడుతున్నారు.ఈ సమయంలోనే నిత్యావసర వస్తువుల ధరలతో పాటు కూరగాయల ధరలూ ఆకాశాన్నంటడం మింగుడు పడటం లేదు. కరోనాపై పోరాడేందుకు పౌష్టిక ఆహారం తీసు కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యాన్ని పెంచే కూరగాయలు కొనుగోలు చేయడానికి కూరగాయల అంగడికి వెళ్తే సామాన్యులకు అందుబాటులో లేని ధరలు కనిపిస్తున్నాయి. ఒకవైపు కరోనా కారణంగా ఉపాధి లేక జనం నానా ఇబ్బందులు పడుతున్నారు.