కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో దేశమంతా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. లాక్డౌన్ కారణంగా దేశంలోని చారిత్రక కట్టడాల సందర్శన నిలిపివేసింది కేంద్రప్రభుత్వం. అందులో భాగంగా తాజ్ మహాల్ సందర్శనను సైతం నిలిపివేసింది. మార్చి 17న తాజ్మహల్ సందర్శనను నిలిపివేయగా అన్లాక్ 4.0లో ఆరునెలల తరువాత తెరుచుకుంటోంది. సోమవారం నుంచి ఈ విశిష్ట కట్టడం సందర్శనకు అనుమతించినట్టు పురావస్తుశాఖ అధికారులు వెల్లడించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. తూర్పు, పశ్చిమ ద్వారాల వద్ద శానిటైజేషన్తోపాటు థర్మల్ స్క్రీనింగ్, భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసినట్లు తాజ్మహల్ సంరక్షణ అధికారి అమర్నాథ్ గుప్తా పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం తాజ్మహల్ను మూసివేస్తామని, కోవిడ్-19 నిబంధనలను పర్యాటకులు తప్పనిసరిగా అనుసరించాలని ఆగ్రా జిల్లా కలెక్టర్ ప్రభు ఎన్ సింగ్ సందర్శకులకు విజ్ఞప్తి చేశారు. తాజ్మహల్ సందర్శనకు వచ్చే పర్యాటకులు ముందుగానే ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. విదేశీయులకు టికెట్ ధర రూ.1,100 కాగా, స్వదేశీయులు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. ఒక షిఫ్ట్లో 2,500 మంది చొప్పున రోజుకు 5,000 మందిని మాత్రమే అనుమతించనున్నారు. ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, శానిటైజర్ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. తాజ్ మహాల్ పరిసర ప్రాంతాల్లో గ్రూప్ ఫొటోలు తీసుకునేందుకు అనుమతిలేదని తెలిపారు. తాజ్ లోపల విజిటర్లు.. ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది. లైసెన్స్ పొందిన టూర్ గైడ్స్ ను మాత్రమే లోనికి అనుమతిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇక్కడి అధికారులు, సిబ్బంది మాస్కులు ధరించి సందర్శకులకు సహకరిస్తారు. పర్యాటకులకు టెంపరేచర్ చెక్ చేస్తారు. సెల్ఫీలు తీసుకోవచ్చునని అధికారులు తెలిపారు. ఇకపోతే ఈ అద్భుత కట్టడాన్ని మొగల్ రాజు షాజహాన్ తన రాణి ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం 17వ శతాబ్దంలో నిర్మించారు. గతంలో 1978లో ఆగ్రాలో వరదలు వచ్చినప్పుడు ఒకసారి తాజ్ సందర్శన రద్దు చేశారు. అంతకు ముందు 1971లో పాకిస్తాన్ - భారత్ యుద్ధ సమయంలోనూ స్వల్పకాలం మూసివేశారు. కానీ, ఇంత సుదీర్ఘకాలం మూతపడటం మాత్రం ఇదే తొలిసారి కావడం విశేషం.