ఊపిరిసలపనియ్యని ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలోనే లోయెస్ట్ సూపర్ ఓవర్ స్కోర్ చేసిన జట్టుగా పంజాబ్ అప్రతిష్టను మూటగట్టుకుంది. పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన జట్టును 60 బంతుల్లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సులతో 89 పరుగులు చేసి మయాంక్ అగర్వాల్ గట్టు వరకు తీసుకొచ్చిన విజయాన్ని ఢిల్లీ 'సూపర్'గా ఎగరేసుకుపోయింది. దీనికి కారణం సూపర్ ఓవర్ లో పంజాబ్ పేలవమైన ప్రదర్శననే.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. స్టోయినిస్( 21 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్స్లతో 53 ) సూపర్ ఫిఫ్టీతో మెరుపులు మెరిపించాడు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన కింగ్స్ పంజాబ్.. మయాంక్ అగర్వాల్(60 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 89) వీరోచిత ఇన్నింగ్స్తో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 157రన్స్ చేయడంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్కు దారి తీసింది.
సూపర్ ఓవర్లో కింగ్స్ పంజాబ్ రెండు పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ విజయానికి మూడు పరుగులు అవసరమయ్యాయి. ఈ మూడు పరుగుల్ని ఢిల్లీ సునాయసంగా సాధించి తాము ఫేవరెట్ జట్లలో ఒకటని నిరూపించుకుంది. కింగ్స్ పంజాబ్ ఆడిన సూపర్ ఓవర్లో రాహుల్ రెండు పరుగులు చేసి ఔటయ్యాడు. రబడా వేసిన రెండో బంతికి రాహుల్ ఔట్ కాగా, ఆ మరుసటి బంతికి పూరన్ బౌల్డ్ అయ్యాడు. సూపర్ ఓవర్లో రెండు వికెట్లు పడితే అక్కడితో ఒక జట్టు ఇన్నింగ్స్ ముగుస్తుంది. దాంతో కింగ్స్ మూడు పరుగుల్ని మాత్రమే ఢిల్లీకి నిర్దేశించింది. అనంతరం మూడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. మూడు బంతుల్లో ముగించింది. అయితే రిషభ్ పంత్ తొలి రెండు బంతులను వదిలేసి టెన్షన్ పెట్టాడు. ఇక మూడో బంతిని ఫైన్ లెగ్ మీదుగా ఆడిన పంత్.. మూడు పరుగులు తీయడంతో ఢిల్లీ విజయం లాంఛనమైంది. ఇలా పంజాబ్ ఆటగాళ్లు సూపర్ ఓవర్ లో చూపిన అశ్రద్ధ మ్యాచ్ ను కోల్పోయేలా చేసింది.