తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, రిజర్వాయర్లు నిండుకుండను తలపిస్తున్నాయి. పలు చోట్ల వాగులు, వంకలు పోటెత్తడంతో గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది తదుపరి 24 గంటలలో వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో బలపడే అవకాశం ఉంది. మరో నాలుగు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటం వల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా ఆది, సోమవారాలు వానలు పడే అవకాశం ఉందని, పలు చోట్ల భారీ వర్షాలు పడుతాయని ఐఎండీ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, రూరల్, మహమూబాబాద్, భద్రాద్ది కొత్తగూడెం, ఖమ్మంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.