టీమ్ఇండియా పేసుమాంత్రికుడు ‘జస్ప్రీత్ బుమ్రా’ ప్రపంచ అత్యుత్తమ టీ20 బౌలరని ఆస్ట్రేలియా పేసర్ జేమ్స్ ప్యాటిన్సన్ ప్రశంసించాడు. ఐపీఎల్-2020లో అతడితో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపాడు. కివీస్ పేసర్ బౌల్ట్ సైతం అనుభవజ్ఞుడని పేర్కొన్నాడు. ముంబయి ఇండియన్స్ టీవీతో అతడు మాట్లాడాడు. ‘ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లతో కలిసి పనిచేయడం అద్భుతం. ఇంకా చెప్పాలంటే బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ టీ20 బౌలర్. ముంబయి శిబిరంలో బౌల్ట్ కూడా ఉన్నాడు. వారితో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం ఇస్తుంది. గతంలో నేను యూఏఈలో వన్డేలు ఆడాను. అక్కడి పిచ్లపై నాకు కొంత అనుభవం ఉంది. కాలం గడిచే కొద్దీ వికెట్లు పొడిగా మారుతాయి. అందుకే స్కోర్లు తక్కువగా నమోదవుతాయి. నెమ్మది బంతులకు కచ్చితంగా ప్రాధాన్యం ఉంటుంది’ అని ప్యాటిన్సన్ అన్నాడు.