అమరావతి : రాష్ట్రంలో కూరగాయల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మండుతున్న కూరగాయల ధరలతో సామాన్యులు సతమతమౌతున్నారు. కరోనా వేళ లాక్డౌన్ నిబంధనలతో శుభకార్యాలు చెప్పుకోదగ్గ స్థాయిలో జరగడం లేదు. దీంతో కూరగాయలకు పెద్దగా డిమాండ్ లేకపోయినా, ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. వర్షాలు ఆశాజనకంగా కురిసి కూరగాయల ఉత్పత్తి బాగున్నప్పటికీ ధరలు పెరగడంపై సామాన్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.చాలా రకాల కూరలగాయలు రిటైల్గా కిలో రూ.50పైనే పలుకుతున్నాయి. రైతుబజార్లలో కొన్ని రకాలు తక్కువగా ఉన్నా, మరికొన్ని రూ.50కి అటు ఇటుగానే ఉంటున్నాయి. హోల్సేల్ రేట్లకు రిటైల్ ధరలకు క్వింటాకు రూ.వెయ్యి వరకు వ్యత్యా సం ఉంటోంది.
రాయలసీమ జిల్లాల్లో పండించే టమాటను క్వింటా రూ.3 వేలు కూడా పలకడం లేదు.కానీ, రిటైల్ మార్కెట్లో కిలో రూ.50-రూ.60 వరకు అమ్ముతున్నారు. టమోట క్వింటా రూ. 4,400 హోల్సేల్ రేటు చెప్తున్నారు. వర్షా లు విస్తారంగా కురిసి, పచ్చిమిర్చి బాగా పండుతున్నా, హోల్సేల్గా క్వింటా రూ.7 వేలు అమ్ముతున్నారు. రిటైల్గా కిలో రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు. అయితే, ధరలు ఈ రకంగా మం డడానికి రవాణా చార్జీల భారమే కారణమని వ్యా పారులు చెబుతున్నారు.