ఎన్ఆర్ఐ ఆస్పత్రి నుంచి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ అయ్యారు. రెండ్రోజుల క్రితమే ఈఎస్ఐ కేసులో అచ్చెన్నకు బెయిల్ మంజూరు వచ్చింది. కరోనా పాజిటివ్ రావడంతో మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో అచ్చెన్న చేరారు. పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నకు టీడీపీ నేతలు ఆలపాటి రాజా, అశోక్ బాబు స్వాగతం పలికారు. ఆస్పత్రి నుంచి నేరుగా అచ్చెన్నాయుడు ఇంటికి బయల్దేరారు.
ఈఎస్ఐ వైద్యసేవల కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడికి హైకోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. విజయవాడ ఏసీబీ కోర్టులో పూచీకత్తు సమర్పించి బెయిల్ పొందాలని ఆదేశించింది. అదే విధంగా కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రభావితం చేయరాదని, దర్యాప్తునకు అందుబాటులో ఉండాలని కోర్టు షరతులు విధించింది.
అరెస్టుకు ముందు, జ్యుడీషియల్ కస్టడీ సమయంలోనూ అచ్చెన్నాయుడికి రెండు మార్లు శస్త్రచికిత్స జరగడంతోపాటు కోవిడ్తోనూ బాధపడుతున్న విషయాన్ని కూడా హైకోర్టు పరిశీలనలోకి తీసుకుంది. కేవలం అనారోగ్య కారణాలే గాక,, ఈ కేసులో డబ్బు లావాదేవీల మార్పిడి గురించి, ఆయన దోషి అని చెప్పే ఆధారాలను ప్రాసిక్యూషన్ ఇప్పటి వరకూ నిర్ధారించలేకపోయిందన్న విషయాన్ని కూడా న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు.