వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. ‘దాడులు, వేధింపులతో ప్రభుత్వం ఏమీ సాధించలేదు. జగన్ నాయకత్వంలో రాష్ట్రం దాడుల ఆంధ్రప్రదేశ్గా, అప్పుల రాష్ట్రంగా మారింది. బడుగు, బలహీనవర్గాలు, దళితులపై యథేచ్ఛగా దాడులు చేస్తున్నారు. 16 నెలల నుంచీ ఇదే విధానాన్ని ముఖ్యమంత్రి కొనసాగిస్తున్నారు. స్వతహాగా జగన్ ఫ్యాక్షనిస్ట్, అరాచకవాది అని, దాడులు చేసే వ్యక్తని తెలుసు. సొంత బాబాయి హత్య జరిగితే జగన్ ఏం చేశారు. పరిశ్రమలు, కంపెనీలు రాకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుందన్న ఆలోచన పాలకులకు లేదు. ప్రతిపక్షంపై నోరేసుకొని పడిపోయే అంబటి రాంబాబు అవినీతి చరిత్ర బట్టబయలైంది. ఆయన నియోజకవర్గంలోని వైసీపీవారే అంబటి మైనింగ్ రాయుడిగా మారారని ఫిర్యాదు చేసిన విషయం ముఖ్యమంత్రికి తెలియదా? తాను చేస్తున్న మైనింగ్ మాఫియాపై న్యాయవిచారణ కోరే దమ్ము, ధైర్యం అంబటికి ఉన్నాయా? అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇటువంటి అవినీతి పనులు చేస్తున్న వైసీపీవారిని వదిలేది లేదు. ప్రతిపక్ష పార్టీగా తామే జోక్యం చేసుకొని సాక్ష్యాధారాలతో సహా నిజానిజాలు తేలుస్తాం. ముసుగులో అవినీతి చేస్తూ పైకి నీతులు చెప్పడం అంబటి ఎప్పటినుంచో చేస్తున్నాడు. వ్యక్తిగత స్వార్థంకోసం, చంద్రబాబుపై కక్షతో సంపాదనే ధ్యేయంగా మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు. మూడు రాజధానుల అంశంపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అతుకుల బొంతలాంటి నివేదికలతో కోర్టులను మోసగించలేమని తెలుసుకోవాలి’ అని ప్రభుత్వానికి సూచించారు.