కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ పరిధిలోని గోస్పాడు మండలంలోని అన్ని గ్రామాలలో యుద్ధ ప్రాతిపదికన కరోనా నివారణ చర్యలు చేపట్టాలని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చెన్నయ్య, ఏఐటీయూసీ నంద్యాల కార్యదర్శి వెన్నం బాలవెంకట్ లు ఆధికారులను కోరారు.ఆదివారం పట్టణంలో పర్యటిస్తూ స్థానిక గోస్పాడు మండల కేంద్రంలో ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు. అనంతరం వారు ప్రజలకు మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి చెన్నయ్య, ఏఐటీయూసీ నంద్యాల కార్యదర్శి వెన్నం బాలవెంకట్ లు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరోనా నివారణ చర్యలు చేపట్టడంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో వైయస్సార్సీపి ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయన్నారు.అలాగే మండలంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని పల్లెల వైపు కన్నెత్తి చూసే నాధుడు కరువయ్యాడని నంద్యాల ఎమ్మెల్యే మండలం వైపు కన్నెత్తి చూడడం లేదని వర్షాకాలం కావడంతో గ్రామాల్లో సీజనల్ రోగాలతో ప్రజలు అల్లాడుతున్నారన్నారు.నంద్యాలకు కూతవేటు దూరంలో ఉన్న ఏఒక్క రోజు కూడా గోస్పాడు మండల గ్రామాలను పట్టించుకోకపోవడం దుర్మార్గమని ఇప్పటికైనా నంద్యాల ఎమ్మెల్యే తక్షణమే స్పందించి గోస్పాడు మండలంలోని అన్ని గ్రామాలలో పర్యటించి కరోనా నివారణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీ మధ్యాహ్న భోజన పథకం యూనియన్ మండల కార్యదర్శి దూదేకుల దస్తగిరమ్మ, ఏపీ గిరిజన సమాఖ్య నియోజకవర్గ కార్యదర్శి ఎరుకలి నాసరి నరసింహులు, ఆటో యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు, ప్రసాద్, కరుణాకర్, రాములు తదితరులు పాల్గొన్నారు.