బెంగాల్ లోని కోల్కతాలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యాపారి మొత్తం 16 మంది మగాళ్లకు లీగల్ నోటీసులు పంపాడు. తన భార్యతో వాళ్లంతా వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆ నోటీసులలో పేర్కొన్నాడు. వాళ్లంతా రూ.100 కోట్లను తనకు పరువు నష్టానికి పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. పోలీసుల కథనం మేరకు.. తన భార్యపై అనుమానం వచ్చిన ఆ ప్యాపారి ఓ ప్రముఖ డిటెక్టివ్ని కలిశాడు. మేటర్ చెప్పాడు. ఆ రోజు నుంచి ఆ డిటెక్టివ్ అతని భార్యతో ఎవరెవరు వివాహేతర సంబంధం పెట్టుకున్నారో పక్కా ఆధారాలు సేకరించాడు. మొత్తం 16 మంది చిట్టాను వ్యాపారికి ఇచ్చాడు. దీంతో ఆ వ్యాపారి డిటెక్టివ్కి తెలియకుండా మరో ప్లాన్ వేశాడు. తన కారు డ్రైవర్కి కూడా ఇదే పని అప్పగించాడు. ఆ డ్రైవర్ కూడా అన్నీ గమనించి పూర్తి వివరాలు వ్యాపారికి ఇచ్చాడు. అటు డిటెక్టివ్, ఇటు డ్రైవర్ ఇద్దరూ చెప్పిన వివరాలు సరిపోలాయి. ఆధారాలు పక్కాగా ఉండటంతో ఆ వ్యాపారి 16 మందికీ లీగల్ నోటీసులు పంపాడు. రెండు వారాల్లో తనకు రూ.100 కోట్లు చెల్లించకపోతే చట్ట పరంగా యాక్షన్ తీసుకుంటానని చెప్పాడు. నోటీసులో బిజినెస్మేన్ ఏం రాశాడంటే "నాకు ఈ మధ్య తెలిసింది. మీరు నా భార్యతో రహస్యంగా వివాహేతర శారీరక సంబంధం పెట్టుకున్నారు. ఆమె వివాహిత అని మీకు తెలుసు. నేను ఆమె భర్తను అని కూడా తెలుసు. మీ చట్టవ్యతిరేక చర్య వల్ల నా వైవాహిక జీవితం నాశనమైంది. సమాజంలో నా పరువు మంటకలిసింది. నేను బాధతో ఉన్నాను. నేను పరువు నష్టం దావా వేసిన కారణంగా మీరు రూ.100 కోట్లను వచ్చే రెండు వారాల్లో చెల్లించాలి. మీరు చెల్లించకపోతే, లీగల్ యాక్షన్ తీసుకుంటాను" అని రాశాడు. ఇక ఈ కేసు 2 వారాల తర్వాత తేలనుంది.