అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి మరో రెండు రోజులు కొనసాగనుంది. అల్పపీడనం మరింతగా బలపడనుందని హైదరాబాద్, విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రాలు హెచ్చరించాయి. కొన్ని ప్రాంతాల్లో వరదలతో కూడిన వర్షాలు ఉంటాయని, మరికొన్ని ప్రాంతాల్లో తుంపర జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపాయి. వృద్దులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు వర్షసూచనల దృష్ట్యా ఇంట్లోనే ఉంటే మంచిదని వాతావరణ శాఖ తెలియజేసింది.తెలంగాణలో వర్షాలు భారీ కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్లోని గాంగ్ టక్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 9.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి వైపునకు వంపు తిరిగి ఉన్నది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. ఉత్తర బంగాళాఖాతంలో సుమారుగా ఆగస్ట్ 19 తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణలో ఈ రోజు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఎల్లుండి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణలోని మరికొన్ని జిల్లాలకు వానలు విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఆంధ్రప్రదేశ్ లో అల్పపీడనం రెండు రోజుల్లో మరింతగా బలపడనుందని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఏపీలో ఆదివారం ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు భారీ వర్షాలతో నదులు, చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి నదికి వరద ప్రవాహం పెరిగింది. గడిచిన మూడు రోజులుగా వరద నీరు క్రమేపి పెరుగుతూ వస్తోంది. దీంతో గోదావరిలో వరద ప్రవాహాన్ని సీడబ్ల్యూసీ ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. భద్రాచలం దగ్గర గోదావరి నదిలో నీటిమట్టం పెరుగుతోంది.. ఇప్పటికే నీటిమట్టం 43.4 అడుగులకు చేరుకోవడంతో.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. చర్ల మండలం తాలిపేరు ప్రోజెక్టుకు వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది.. ప్రాజెక్టు 23 గేట్లను ఎత్తివేసిన అధికారులు.. 1,25,120 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మత్య్సకారులు వేటకు వెళ్లోద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
కర్నూలు జిల్లా ఉష్ణోగ్రతలు:
నేడు గరిష్టంగా 28 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.03 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.41 గంటలకు కానుంది.