ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో విజయవాడలోని రమేష్ ఆసుపత్రి అగ్నిప్రమాదం ఓ కుటుంబంలో పెను విషాదం నింపింది..7 వ నెల గర్భంతో ఉన్న అబలకు భర్తను దూరం చేసింది.. అతడి తల్లినీ అగ్నికి ఆహుతి చేసింది. దుడ్డు ప్రసాద్ అనే కిరాణా వ్యాపారి గత నెల 30వ తేదీన కరోనా వైరస్ బారిన పడ్డాడు. మెరుగైన వైద్యం తీసుకోవాలని విజయవాడ రమేష్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. చికిత్స అనంతరం ఆయన కోలుకుని రెండు రోజుల క్రితమే ఇంటికి చేరాడు. అయితే ప్రసాద్ నుంచి వైరస్ ఆయన భార్య వెంకట జయలక్ష్మి (48), ఆయన పెద్దకుమారుడు పవన్కుమార్ (30), రెండో కుమారుడు మనోజ్కు సోకింది. కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్ష చేయించుకోవడంతో పాజిటివ్గా తేలింది. అధికంగా లక్షణాలు ఉన్న వెంకట జయలక్ష్మి, పవన్కుమార్లు కూడా రమేష్ హాస్పిటల్లోనే జాయిన్ అయ్యారు. మరో రెండు రోజుల్లో ఇంటికి పంపిస్తామని అక్కడి వైద్యులు చెప్పారు. ఇంతలోనే ఊహించని విధంగా జరిగిన అగ్ని ప్రమాదంలో వారు ఇరువురూ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్లో ఆదివారం తెల్లవారు జామున జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న తల్లి, కుమారుడు ఇద్దరూ మృతిచెందారు. అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పవన్కుమార్ ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. లాక్డౌన్ వల్ల ఇంటికి వచ్చి వర్క్ ఫ్రం హోం విధానంలో ఇక్కడి నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు. పవన్కుమార్కు ఏడాదిన్నర క్రితం గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన మౌనికతో వివాహమైంది. మౌనిక 7వ నెల గర్భిణి. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. పవన్కుమార్ మృతితో ఆమె పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇలా కరోనా ఈ రెండు కుటుంబాల్లో అంతులేని ఆవేదనను మిగిల్చింది.