ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ 2013లో ముంబయిలో ఓ మహిళపై అత్యాచారం చేశారంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపణలు చేయడం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలును సీఎం హేమంత్ సొరెన్ తీవ్రంగా ఖండించారు. తన పరువుప్రతిష్ఠలకు భంగం కలిగించేందుకే సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేపై న్యాయస్థానంలో రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేశారు. అంతేకాదు, నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలను ట్విట్టర్, ఫేస్ బుక్ తొలగించలేదని చెబుతూ, ఆ సోషల్ నెట్వర్కింగ్ సైట్లపైనా తన దావాలో ఫిర్యాదు చేశారు.
అయితే, సీఎం సొరెన్ కోర్టులో దావా వేసినా సరే బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే వెనక్కి తగ్గలేదు. "మీరు న్యాయపోరాటం చేయాల్సింది ముంబయిలోని ఓ మహిళపై. ఎందుకంటే మీరు అత్యాచారం చేశారంటూ ఆమె మీపై ఫిర్యాదు చేసింది కాబట్టి" అని స్పందించారు. కాగా, సొరెన్ వేసిన దావాపై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.