అయోధ్యలో మసీదు శంకు స్థాపనకు ముఖ్యమంత్రి యోగిని ఆహ్వానించే విషయంలో ముస్లిం నేతలు శనివారం ఓ స్పష్టతనిచ్చారు. అయోధ్యలోని ధన్నీపూర్లో నిర్మించబోయే మసీదు శంకు స్థాపనకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కచ్చితంగా ఆహ్వానిస్తామని ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ప్రకటించింది. ‘‘ధన్నీపూర్లో 5 ఎకరాల విస్తీర్ణంలో మసీదు నిర్మాణం చేపడతాం. ఇందులో ఓ ఆస్పత్రి, ఓ గ్రంథాలయం, వంటశాల, ఓ అధ్యయన కేంద్రాలను కూడా నిర్మిస్తాం. మసీదు శంకు స్థాపనకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను ఆహ్వానిస్తాం.’’ అని ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ అధికార ప్రతినిధి అథర్ హుస్సేన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొనడమే కాకుండా... ప్రజల సౌకర్యానికి నిర్మించే వాటికి ఆర్థిక సహాయం కూడా అందిస్తారని ఆయన వెల్లడించారు. ధన్నీపూర్లో నిర్మించే మసీదుకు ‘బాబ్రీ మసీదు’ అనే నామకరణం చేస్తారా? అని ఆయన్ను ప్రశ్నించగా... పేర్లకు అంత ప్రాముఖ్యం లేదని, మసీదు మాత్రమే తమకు ప్రాముఖ్యమమని, మిగితా వ్యవహారాలన్నీ కూడా అర్థం పర్థం లేనివని అథర్ కొట్టిపారేశారు.