ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ స్థానానికి గట్టి పోటీ.. రేసులో బైజూస్, జియో, అమెజాన్!

national |  Suryaa Desk  | Published : Sat, Aug 08, 2020, 12:58 PM

ఈ సంవత్సరం ఐపీఎల్ టైటిల్ స్పాన్సరర్ గా వివో కొనసాగబోవడం లేదని, అతి త్వరలోనే కొత్త స్పాన్సరర్ కోసం టెండర్ల ప్రక్రియను ప్రారంభిస్తామని బీసీసీఐ ప్రకటించిన వెంటనే, తదుపరి ఐపీఎల్ తో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు పలు కంపెనీలు ఆసక్తిని చూపుతున్నాయి.
"2020 సంవత్సరం ఐపీఎల్ కు సంబంధించిన బీసీసీఐ, వివో మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తమ మధ్య ఉన్న భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నాయి" అంటూ బీసీసీఐ ఓ ఏకవాక్య ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ వెంటనే తొలుత బయటకు వచ్చిన పేరు బైజూస్. ప్రస్తుతం ఇండియన్ టీమ్ కు ప్రధాన స్పాన్సరర్ గా ఉన్న బైజూస్, ఐపీఎల్ తో కూడా భాగస్వామ్యం అయ్యేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ సంస్థకే తొలి ప్రాధాన్యత ఉంటుందని బీసీసీఐ అంటోంది. లాక్ డౌన్ నేపథ్యంలో ఆన్ లైన్ క్లాసులకు డిమాండ్ పెరుగగా, బైజూస్, అత్యధిక లాభాలను పొందిన సంస్థల్లో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో బైజూస్ కు ప్రధాన పోటీ జియో నుంచి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంతమొత్తమైనా పెట్టేందుకు జియోకు అడ్డంకులు ఉండబోవనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఐపీఎల్ లో దాదాపు సగం జట్లతో జియో జట్టుకట్టింది. జియో మాతృసంస్థ రిలయన్స్ చేతిలో ముంబై ఇండియన్స్ జట్టుంది. లీగ్ తో తొలి ఏడాది నుంచే కలిసి ప్రయాణం చేస్తోంది. దీంతో జియోకు కూడా అవకాశాలు ఉన్నాయని అంచనా.
ఈ రెండు సంస్థలతో పాటు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సైతం ఆసక్తిని చూపిస్తోంది. ఇంతవరకూ క్రికెట్ తో ఎక్కడా డీల్స్ కుదుర్చుకోని అమెజాన్, ఇదే తమకు సరైన సమయమని భావిస్తోంది. వీటితో పాటు గతంలో ఐపీఎల్ టైటిల్ కు స్పాన్సరర్ గా కొన్నేళ్లు పెప్సీ వ్యవహరించిన నేపథ్యంలో, ఇప్పుడు ఆ స్థానంలోకి రావాలని కోకాకోలా భావిస్తోంది. ఇక ఈ సంస్థల్లో దేనికి అవకాశం లభిస్తుందన్న విషయం మరో వారం పది రోజుల్లో తేలిపోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com