ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. జిల్లాల పునర్విభజన చేపట్టి మొత్తం 25 జిల్లాలను ఏర్పాటు చేయాలని ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు మరో అడుగు పడింది. జిల్లాల పునర్విభజనపై కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలో సీసీఎల్ఏ కమిషనర్, జీఏడీ కార్యదర్శి, ప్రణాళికశాఖ కార్యదర్శి, సీఎంవో అధికారి, ప్రిన్సిపల్ ఫైన్సాన్స్ సెక్రటరీ తదితరులు సభ్యలుగా కొనసాగనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు వనరులు, తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. దీంతో పాటు జిల్లాల సరిహద్దులు, జిల్లాలో వనరుల సమతూకం తదితర అంశాలపై కమిటీ చర్చించనుంది. ఈ కమిటీ మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.