నేటి ఆధునిక యుగంలోనూ కులమతాల నడుమ తారతమ్యాలు మాత్రం చెరగడం లేదు. తెలంగాణలోని మిర్యాలగూడలో ప్రణయ్ దారుణ హత్యను మరవక ముందే ఉత్తరప్రదేశ్ లో అంతకు మించిన దారుణం చోటు చేసుకుంది. తక్కువ కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందన్న కారణంతో ఉత్తరప్రదేశ్లోని బాందాలో ఓ 19 ఏళ్ల యువతిని, ఆమె ప్రియుడిని సొంత కుటుంబసభ్యులే సజీవ దహనం చేశారు. కర్చా గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకుంది.యువతి, ఆమె ప్రియుడిని ఓ గుడిసెలో బంధించి దానికి నిప్పు పెట్టిపెట్టారు. ఘటన జరిగిన అనంతరం గమనించిన స్థానికులు బాధితులను ఆసుపత్రికి తరలించారు. అక్కడే భోలా(23) మరణించగా, యువతి ప్రియాంకను వేరే ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయిందని అదనపు ఎస్పీ మహేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. ఈ విషయమై కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. ఇందుకు కారణమైన యువతి కుటుంబానికి చెందిన తొమ్మది మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకోగా.. మిగిలిన నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు.