రాజధాని పిటిషన్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధాని అమరావతి పరిధిలో నిర్మించిన భవనాలపై వివరాలు కోరింది. రాజధాని నిధుల వ్యయం పిటిషన్పై త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. మొత్తం రూ. 52 వేల కోట్లు ఖర్చు చేశారని న్యాయవాది సీఆర్డీఏ రికార్డు చూపించగా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఎంత ఖర్చు చేశారు, ఎక్కడ నిర్మాణం ఆగిందో వివరాలు కావాలని ఆదేశింది. ఇది ప్రజల సొమ్ము.. రాష్ట్ర ఖజానాకు నష్టం కదా. కట్టిన భవనాలు వాడకుంటే పాడైపోతాయి కదా.. ఆ నష్టం ఎవరు భరిస్తారు అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నిధులు ఎక్కడి నుంచి తీసుకువచ్చారు... రూ. 52 వేల కోట్ల ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నాయో వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. రాష్ట్ర అకౌంటెంట్ జనరల్కు వెంటనే నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినట్లు న్యాయవాది ప్రసాద్ బాబు వెల్లడించారు. ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 14కు వాయిదా వేసింది.