కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాల్ని తీసుకొచ్చింది. అందులో కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి. గతేడాది ఫిబ్రవరి నెలలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ను ప్రారంభించారు. రైతులకు ఆర్థికంగా సాయం చేయాలన్న లక్ష్యంతోనే మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీంతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ యోజన కూడా కేంద్ర సర్కార్ ప్రారంభించింది. కిసాన్ క్రెడిట్ కార్డస్ ఉన్న వారందరికీ రుణాలు కూడా అందిస్తోంది. అయితే ప్రధాని కిసాన్ సమ్మన్ నిధి పథకం.. కెసిసి-కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం లబ్ధిదారుల మధ్య సుమారు 2.5 కోట్ల మంది అంతరం ఉంది. ఈ రైతులకు కెసిసి అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.
కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి చెప్పిన వివరాల ప్రకారం దాదాపు 2.5 కోట్ల మంది రైతులకు 2 లక్షల కోట్ల రూపాయల సులువు మరియు రాయితీ క్రెడిట్ లభిస్తుంది. రైతులు మనీల్యాండర్స్ నుంచి రుణం తీసుకుంటే వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ రుణం నుంచి రైతు త్వరగా బయట కూడా పడలేడు. అలాంటి ఇబ్బందుల్లో అన్నదాతలు పడకూడదనే ఉద్దేశంతోనే రైతు రుణాల్ని ప్రారంభించింది ప్రభుత్వం. సర్కార్ అందిస్తున్న ఈ రుణం తీసుకునేటప్పుడు, ఏటా 4 శాతం వడ్డీ మాత్రమే వసూలు చేస్తారు, ఇది దేశంలో అన్నిరకాల రునాలపై అందిస్తున్న వడ్డీ రేట్ల కంటే అతి తక్కువ రేటు అన్నారు మంత్రి.