అయోధ్యలో ఈ నెల 5న జరగనున్న రామ మందిర భూమి పూజకు భాజపా అగ్ర నాయకులు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషికి ఆహ్వానం అందింది. వారికి ఆహ్వానం అందించినట్లు ఆలయ ట్రస్ట్ అధికారి ప్రకాశ్ కుమార్ గుప్తా తెలిపారు. వారిని ఆహ్వానించలేదని వచ్చిన వార్తలు కేవలం వదంతులేననని కొట్టిపారేశారు. వాటిలో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టంచేశారు. అడ్వాణీ, జోషీ సహా మరికొందరు ప్రముఖులకు మెయిల్, ఫోన్ ద్వారా సమాచారం అందించామన్నారు.కరోనా కారణంగా ఎక్కువ మంది పూజలో పాల్గొనకపోవచ్చు, మరికొందరికి ప్రయాణ ఇబ్బందులు ఉండవచ్చన్నారు. అంతేకానీ మేము వారిని పిలవలేదనే మాటల్లో వాస్తవం లేదన్నారు. అందరి మనోభావాలను గౌరవించడమే ట్రస్ట్ విధి అని ప్రకాశ్ కుమార్ స్పష్టం చేశారు. పోస్ట్ ద్వారా పంపే ఆహ్వానం సమయానికి చేరుకుంటుందనే నమ్మకం లేదన్నారు. అందుకే ఫోన్ చేసి ఆహ్వానించామన్నారు.