కరోనా భయంతో కొందరు మానవత్వాన్ని మరిచిపోతున్నారు. తాజాగా కరోనా అనుమానంతో కొందరు 19 ఏళ్ల ఓ యువతిని బస్సులో నుంచి నిర్ధాక్షిణ్యంగా తోసేయడంతో బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. యూపీకి చెందిన అన్షిక యాదవ్ (19) జూన్ 15న తన తల్లితో కలిసి ఢిల్లీ నుంచి స్వస్థలానికి బయల్దేరింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కింది. అయితే బస్సు బయల్దేరిన కొద్దిసేపటికే యువతికి కరోనా లక్షణాలు ఉన్నట్లుగా కొంత మంది అనుమానించారు. బస్సులో నుంచి దింపేయాలని డ్రైవర్, కండక్టర్ను కోరారు. తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని అన్షిక, ఆమె తల్లి వేడుకున్నా ఏ ఒక్కరి మనసు కరగలేదు. ఇతర ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేయడంతో బస్సు డ్రైవర్, కండక్టర్ ఆ యువతిని బలవంతంగా కిందకి తోసేశారు. రోడ్డుపై పడిపోయిన యువతి అరగంట తర్వాత ప్రాణాలు విడిచింది.ఘటన జరిగిన వెంటనే మథుర పోలీసులను ఆశ్రయించగా.. వాళ్లు కేసు నమోదు చేసుకోవడానికి నిరాకరించినట్లు బాధితురాలి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ మహిళా కమిషన్ ఆదేశాలతో జులై 9న పోలీసలు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసును పర్యవేక్షించాల్సిందిగా రూరల్ ఎస్పీ శిరీష్ చంద్రను కమిషన్ ఆదేశించింది. అన్షికను తాకితే కరోనా సోకుతుందని భయపడి డ్రైవర్ ఆమెను దుప్పటితో చుట్టి బస్సులో నుంచి తోసేసినట్లు ఆమె సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు.