కరోనా పరీక్షలు, చికిత్స విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేసీఆర్ సర్కారుకు మరో అంశం తలనొప్పిగా మారింది. కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలో చేర్చుతూ ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి వస్తోంది. తెలంగాణలోనూ కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలంటూ వివిధ రాజకీయ పక్షాలు, సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. విపత్తు వేళ జగన్ ఆరోగ్య శ్రీ జాబితాలో కరోనా చికిత్సను చేరిస్తే.. కేసీఆర్ సెక్రటేరియట్ను కూలుస్తున్నారని మండిపడ్డారు. ఎవరి ప్రాధాన్యం ఏంటో తెలుస్తోందంటూ చురకలు అంటించారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.ఇప్పటికే కేంద్రం కరోనా చికిత్సను ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలోకి తీసుకొచ్చింది. కానీ ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్య శ్రీనే మెరుగైన పథకం అని చెప్పిన కేసీఆర్.. ఆయుష్మాన్ భారత్ను తెలంగాణలో అమలు చేయడం లేదు. కానీ ఇప్పుడు కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తేకపోవడంతో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ పరిధిలోకి కరోనా చికిత్సను చేర్చాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల నేతలు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ను కలిశారు. పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో ఇదే రకమైన డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కారు ఆరోగ్య శ్రీలో కరోనా చికిత్సను చేర్చే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.