ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శుద్ధ ఇంధన రంగంలో ఆకర్షణీయ మార్కెట్‌గా భారత్: ప్రధాని మోదీ

national |  Suryaa Desk  | Published : Sat, Jul 11, 2020, 01:11 PM

శుద్ధ ఇంధన రంగంలో ప్రపంచంలోనే ఆకర్షణీయ మార్కెట్‌గా భారత్‌ ఎదిగిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని రీవాలో ఆసియాలోనే అతిపెద్ద సౌరవిద్యుత్‌ పార్కు ఏర్పాటైంది. 750 మెగావాట్ల సామర్థ్యం గల ఈ పార్కుని శుక్రవారం ప్రారంభించిన మోదీ.. దీన్ని జాతికి అంకితం చేశారు. దీంతో మధ్యప్రదేశ్‌ శుద్ధ, సౌర ఇంధనానికి కేంద్రంగా ఎదుగుతుందని ఆకాంక్షించారు. సౌర శక్తి శుద్ధమైన, భద్రతమైన, భరోసా కల్పించే ఇంధనమని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తితో సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో ఐదు అగ్రశ్రేణి దేశాల సరసన భారత్‌ నిలిచిందన్నారు. పర్యావరణహిత విద్యుత్‌ వినియోగానికి ప్రోత్సహిస్తూ.. దేశవ్యాప్తంగా 36 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను అందజేశామని ప్రధాని తెలిపారు. దీంతో డిమాండ్‌ పెరిగి ఉత్పత్తి పెరిగిందని.. తద్వారా ఆరేళ్లలో వాటి ధర పదింతలు తగ్గాయని వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో విద్యుత్‌ రంగానిది చాలా కీలక భూమిక అని వివరించారు. అభివృద్ధిలో భారత్‌ కొత్త శిఖరాలకు ఎదుగుతున్న కొద్దీ మన ఆశలు, ఆకాంక్షలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. అదే స్థాయిలో మన చమురు, విద్యుత్‌ అవసరాలు కూడా పెరుగుతాయన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌ రంగంలోనూ స్వయం సమృద్ధి సాధించడం చాలా కీలకమన్నారు.రూ. 4,500 కోట్లతో రీవా సోలార్ పార్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ పార్కులోని మూడు విభాగాల్లో 250 మెగావాట్ల చొప్పున విద్యుదుత్పత్తి జరగనుంది. ఈ ప్రాజెక్టులో 24 శాతం విద్యుత్‌ను దిల్లీ మెట్రోకు సరఫరా చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com