ఓ వ్యక్తి తన భార్యను హనీమూన్ కోసం ఊటికి తీసుకెళ్లాడు. అంతకు ముందే పక్కా ప్లాన్ ప్రకారం ప్రియురాలిని సైతం అక్కడికి పంపాడు. ఇద్దరినీ ఒకే హోటల్ లో ఉంచి సినిమా మాదిరిగా డ్రామా ఆడాడు. అనంతరం భార్యకు విషయం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.కర్ణాటకలోని బళ్లారికి చెందిన మంజునాథ్కు ఈ ఏడాది ప్రారంభంలో బెంగుళూరుకు చెందిన యువతి(21)తో వివాహం జరిగింది. మార్చి నెల రెండో వారంలో హనీమూన్కు వెళదామంటూ భార్యను తీసుకెళ్లాడు. కానీ అంతకుముందే తన ప్రియురాలిని సైతం ఊటీకి పంపాడు. అప్పటికి ఇంకా లాక్ డౌన్ ప్రారంభం కాకపోవడంతో వీరు ఊటీకి చేరుకున్నారు. మంజునాథ్ ఒకే హోటల్లో రెండు గదులు తీసుకున్నాడు. ఓ గదిలో ప్రియురాలిని ఉంచారు. మరో గదిలో తాను భార్యతో కలిసి ఉన్నాడు.భార్యను హోటల్ గదిలోనే ఉంచి ప్రియురాలిని తీసుకుని బయటకు వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చేవాడు. నిత్యం ఆఫీసు పని మీద వెళ్తున్నానని చెప్పి భార్యను గదిలోనే ఉంచేవాడు. ఇటీవల లాక్ డౌన్ ఆంక్షలు సడలించడంతో మంజునాథ్ దంపతులు బళ్లారికి వచ్చారు. ఇటీవల భార్య మంజునాథ్ మొబైల్ను పరిశీలించింది. అందులో మంజునాథ్ ప్రియురాలితో కలిసి దిగిన సెల్ఫీలు చూసి షాక్ అయ్యింది. ఆ ఫొటోలు ఊటీలో దిగినవని తెలుసుకుని భర్త తనకు చేసిన మోసాన్ని పసిగట్టింది. ఇదేంటని భర్తను నిలదీయగా నువ్వు నాకు నచ్చలేదని, రూ.25 లక్షలు ఇస్తేనే నీతో ఉంటానన్నాడు. దీంతో బాధిత మహిళ తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది తెలుసుకున్న మంజునాథ్ పరారీలో ఉన్నాడు. ఆ మోసగాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.