భర్తని పోలీసులు రక్తం వచ్చేలా కొట్టడంతో భరించలేకపోయిన భార్య.. ఎస్సై చెంప పగలగొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని విల్లుపురం జిల్లా అనత్తూర్ గ్రామానికి చెందిన ముత్తురామన్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వం ప్రకటించిన షార్ట్లిస్ట్లో ఆయన పేరు కూడా ఉంది. అయితే ఇళ్ల నిర్మాణ పనులు పర్యవేక్షించేందుకు వచ్చిన ప్రైవేటు కాంట్రాక్టర్ సుభాష్ చంద్రబోస్తో వివాదం తలెత్తింది. ఇంటి కోసం తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని ముత్తురామన్ ఆరోపణలు గుప్పించాడు. తీరా పంచాయితీ తిరువెన్నైనల్లూర్ పోలీస్ స్టేషన్కి చేరింది. విచారణలో భాగంగా ఎస్సై సహా ఇద్దరు పోలీసులు అనత్తూర్ చేరుకున్నారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న ముత్తురామన్ని పోలీసులు ప్రశ్నించారు. సరిగ్గా సమాధానం చెప్పడం లేదంటూ ఇద్దరు పోలీసులు ముత్తురామన్పై చేయి చేసుకున్నారు.పోలీసు దెబ్బలకి ముత్తురామన్కి గాయాలై రక్తం కారడం చూసిన అతని భార్య సారథి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెనకాముందూ ఆలోచించకుండా భర్తని కొట్టిన ఎస్సై చెంప పగలగొట్టింది. మహిళ పోలీస్పై చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. మహిళను విచారణకు రావాలని ఆదేశించారు.