కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు చాలా సమయాన్ని కోల్పోయారు. టెన్త్ విద్యార్థులకు పరీక్షలు జరగలేదు. 9వ తరగతి వరకు విద్యార్థులను పరీక్షలు నిర్వహించకుండానే తర్వాతి తరగతులకు ప్రమోట్ చేశారు. కొంతమంది విద్యార్థులకు పరీక్షలు మధ్యలోనే నిలిచిపోయాయి. లాక్ డౌన్ సమయంలో కొన్నిచోట్ల ఆన్లైన్ తరగతులు నిర్వహించారు. ప్రస్తుతం లాక్ డౌన్ భారీ సడలింపులు నేపథ్యంలో పరీక్షలు నిర్వహించేందుకు చాలా రాష్ట్రాలు, యూనివర్సిటీలు, బోర్డులూ సిద్ధమవుతున్నాయి.కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ చేసేందుకు కేంద్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకోనుంది. దీంతో ఆన్లైన్ క్లాసులు నిర్వహించేందుకు రాష్ట్రాలు, యూనివర్సిటీలు, బోర్డులూ మొగ్గుచూపుతున్నాయి. దీనిపై నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంటి దగ్గర ఉండి చదవడం వలన విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ అలవరచుకోలేరని, విషయంపై పరిజ్ఞానం ఎక్కువగా ఉండదని, వారు తమ సహవిద్యార్థులతో మమేకమయ్యే అవకాశాన్ని కోల్పోతారని అభిప్రాయపడుతున్నారు. వారిలో సోషల్ స్కిల్స్ పెరగవని వ్యాఖ్యానించారు. విద్యార్థులు వివిధ అంశాలపై జ్ఞానసముపార్జన కోసం ఉపాధ్యాయులతోనూ, సహ విద్యార్థులతోనూ చర్చించాలన్నారు. పుస్తకాల ద్వారా కొంతమాత్రమే తెలుసుకోగలమని, ఎక్కువ శాతం సమాజం నుండే తెలుసుకోగలమన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ స్కిల్స్, చర్చల వంటివి విద్యార్థుల ఎదుగుదలకు చాలా ముఖ్యమని తెలిపారు.