చిత్తూరు జిల్లాలో యువతి అనుమానాస్పద మృతి మిస్టరీగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పుంగనూరు మండలం మోదుగులపల్లికి చెందిన యువతికి 22 సంవత్సరాలు. అదే మండలానికి చెందిన జువ్వలదిన్నె తండాకు చెందిన యువకుడు సంతోష్ గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. ఇద్దరు మేజర్లు కావడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ విషయం ఇరువురు వారి కుటుంబాలకు చెప్పగా కులాలు వేరు కావడంతో అమ్మాయి తరపు వారు ఒప్పుకోలేదు.దీంతో 3 నెలల క్రితం యువతి,సంతోష్ లు తాము పెళ్లి చేసుకుంటామంటూ పోలీసులను ఆశ్రయించారు. యువతి తరపు వారు వ్యతిరేకించడంతో పోలీసులకు ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చి కొంత కాలం పాటు వేచి ఉండాలన్నారు. వారిద్దరిని ఇళ్లలోకి పంపించారు. యువతి,యువకుడు ఫోన్ లో మాట్లాడుకునే వారు. యువతి తల్లిదండ్రులు విషయం తెలిసి ఆమెను బెదిరించారు. ఏమైందో ఏమో తెలియదు కానీ అనుమానాస్పదంగా యువతి మే 26న మరణించింది. ఎవరికి తెలియకుండానే గ్రామ శివారులో ఉన్న చెరువు వద్ద యువతి అంత్యక్రియలు నిర్వహించారు.ఆ నోటా ఈ నోటా విషయం పెద్దగా మారడంతో యువతి ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు తెలిపారు. ఆత్మహత్య చేసుకుంటే పోలీసులకు ఎందుకు చెప్పలేదన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. యువతిని ఆమె తల్లిదండ్రులే హత్య చేశారని యువకుడు, అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కులాలు వేరు కావడం వల్ల వారు ఈ దారుణానికి పాల్పడ్డారన్నారు. ఇరు వర్గాల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు విచారణలో అసలు నిజాలు బయటపడనున్నాయి. అప్పటి వరకు యువతి మరణం మిస్టరీగానే మారనుంది.