ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో నిరుద్యోగ శాతాన్ని పెంచిన లాక్ డౌన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 28, 2020, 05:47 PM

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్రం లాక్ డౌన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా వలసకూలీలు, నిరుపేదలు, వివిధ వర్గాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కొంతమందికి పూటగడవడం కూడా కష్టమైంది. లాక్ డౌన్ మూలంగా ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది. చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. మరికొన్ని కంపెనీలు ఉద్యోగులకు సగం జీతాలను ఇస్తున్నాయి. 2017–18లో నిరుద్యోగిత 6.1 శాతం వుండగా ఇప్పుడది 24 శాతానికి చేరింది. వలస కూలీలతోపాటు చిన్నా చితకా వ్యాపారులు, నిర్మాణ రంగం, సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలవారు దెబ్బతిన్నారు. నెలనెలా జీతం అందుకునే మధ్యతరగతికి ఆ జీతంలో కోతలు పడటం లేదా ఉద్యోగాలు పోవడం తప్పలేదు. కొన్ని సంస్థలు తమ ఉద్యోగుల్లో పలువురిని వేతనం లేని సెలవుపై వెళ్లాలని కోరాయి. పరిస్థితి చక్కబడితే మళ్లీ పిలుస్తామని తెలిపాయి. రోజుకూలీలు, తోపుడు బళ్లపై వ్యాపారం చేసేవారు ఇప్పుడు నిస్సహాయంగా మిగిలిపోయారు. మొత్తంగా 12 కోట్లమందికి పైగా జనం నిరుద్యోగులుగా మారారని భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ కేంద్రం(సీఎంఐఈ) గణాంకాలు చెబుతున్నాయి. స్టార్టప్‌లు కూడా మూసివేత దిశగా పోతున్నాయని, ఇప్పటికే చాలా సంస్థలు కార్యకలాపాలను ఆపేశాయని నాస్కామ్‌ చెబుతోంది. ఇలా హఠాత్తుగా వచ్చిపడిన లాక్‌డౌన్‌తో అన్ని రంగాలూ ఇక్కట్లు పడుతున్నాయి. ఈ ప్రభావం ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల మీద పడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ శాతాన్నితగ్గించేందుకు మెరుగైన చర్యలు తీసుకోవాలి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్యాకేజీ ద్వారా కేంద్రం భారీ ఊరట కల్పించింది. అలాగే ఔత్సాహికులైన యువతీ, యువకులు పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభించేందుకు కేంద్రం వారికి ఆర్ధికంగా చేయూతనివ్వాలి. ఈ విషయంలో బ్యాంకుల పాత్ర అత్యంత కీలకం. లోన్లు ఇచ్చే విషయంలో కొంచెం ఉదారంగా వ్యవహరించాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com