కరోనా లాక్డౌన్ వల్ల పదో తరగతి పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే 1 నుంచి 9 తరగతుల విద్యార్థులను ఎలాంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేశారు. ఐతే ఈ లాక్డౌన్ వల్ల విద్యా సంవత్సరం కూడా ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ సారి ఆగస్టులో స్కూళ్లు తెరచుకోనున్నాయి. ఆగస్టు 3 నుంచి ఏపీలో స్కూళ్లు ప్రారంభమవుతాయని సీఎం జగన్ అన్నారు. 'మన పాలన మీ సూచన' కార్యక్రమంలో భాగంగా ఇవాళ విద్యా వ్యవస్థపై సమీక్ష నిర్వహించారు సీఎం జగన్. స్కూళ్లు తెరిచే నాటికి విద్యా దీవెన పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలో చదివే ప్రతి విద్యార్ధికి బ్యాగ్, మూడు జతల యూనిఫామ్స్, బెల్టు, బూట్లు, రెండు జతల సాక్సులు, టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్ట్స్ మంచి క్వాలిటీతో అందిస్తామని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకురావాలన్న ఉక్కు సంకల్పంతో ఉన్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు. హాస్టల్ విద్యార్థులు వసతి దీవెన పథకం కింద రెండు దఫాల్లో రూ.20వేలు అందిస్తామని తెలిపారు. కోర్సుల్లో ఇంటర్న్ షిప్ తప్పనిసరి చేసి.. చదువు పూర్తైన తర్వాత ఉద్యోగాలు వచ్చేలా సంస్కరణలు తెస్తామని చెప్పుకొచ్చారు సీఎం జగన్. స్కూల్ ఫీజుల నియంత్రణకు కమిషన్ వెబ్ సైట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పేదరికం మూలాన ఏ ఒక్కరికీ చదువు భారం కాకుడదని.. అందరికీ విద్యా అందాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు సీఎం. ఉన్నత చదువులతోనే పేదల బతకులు మారుతాయని ఆయన అన్నారు.