ఏలూరు, సూర్య ప్రధాన ప్రతినిధి : రొయ్యల ధరలు నెల రోజులుగా అమాంతం పడిపోయాయి. ఏకంగా టన్నుకు రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకూ ధర తగ్గింది. దీంతో సాగుదారులు విలవిల్లాడుతున్నారు. రాష్టవ్య్రాప్తంగా సుమారు రూ. వెయ్యి కోట్ల వరకూ నష్టం వాటిల్లినట్లు సమాచారం. పశ్చిమలో అధికంగా. ఆ తరువాత తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రొయ్యల సాగు చేపడుతున్నారు. అధికారికంగా 3 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుండగా అనధికారికంగా మరో 2 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మొత్తంగా 5 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తుండగా దీనిలో అగ్రభాగం అంటే 4 లక్షల ఎకరాలు వరకూ రొయ్యల చెరువులే ఉన్నాయి. మూడు నెలల కాలపరిమితి చొప్పున సాగే ఈ రొయ్యల చెరువుల ద్వారా సంవత్సరానికి నాలుగు పంటలు తీయవచ్చనే ఆశతో అధికశాతం మంది ఈ సాగువెపు మళ్లుతున్నారు. రైతు ఎకరాకు రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకూ పెట్టుబడి పెడుతుండగా రూ. 2 లక్షల వరకూ మిగిలేది. దీనిద్వారా ప్రభుత్వానికి కూడా సుమారు రూ. 7 వేల కోట్ల నుంచి రూ. 8 వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం సమకూరేది. గడిచిన నెల రోజులుగా ధర రోజురోజుకూ పడిపోతోంది. దీంతో రొయ్య రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ఇప్పటివరకూ ఉన్న ధరల ప్రకారం టన్ను 40 కౌంటు (కిలోకు 40 రొయ్యలు) రూ. 540 వరకూ ఉండేది. అధమంగా 60 కౌంటు నుంచి వంద కౌంటు వరకూ వచ్చినా కూడా రూ. 300లు వరకూ ఉండేది. దీనివల్ల ఎకరాకు రూ. 6 లక్షల వరకూ ఆదాయం వచ్చినా రూ. 2 లక్షల వరకూ మిగిలేది. ప్రస్తుతం ధర అమాంతం పడిపోయింది. 40 కౌంటు ధర రూ. 390 వరకూ ఆ తర్వాత ధరలు దీనికిలోపుగానూ, వంద కౌంటు ధరలు రూ. 200కు పడిపోయాయి. ఎకరా సాగు చేస్తే రూ. 3 లక్షలకు మించి రావడంలేదు. దీంతో ఎకరాకు రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకూ నష్టం వస్తోంది. వేసవిలో వాతావరణ మార్పులతో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆక్సిజన్ శాతం పడిపోవడంతో రొయ్యలు చనిపోతున్నాయి. దీంతో ధర తగ్గిపోతోంది. దీనికితోడు రొయ్యల్లో యాంటీబయోటిక్స్ అవశేషాలు ఉన్నాయనే కారణంతో ఇతర దేశాలు ఎగుమతి అయిన రొయ్యలను తిరిగి వెనక్కి పంపుతుున్నాయి. అక్కడ తీసుకోవడం లేదనే కారణాన్ని అన్నింటికీ చూపిస్తూ ధర తగ్గించేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.