ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల ప్రజలను కలవరపెడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం బుధవారం ఉదయం 9 గంటల సమయానికి మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 329కి చేరుకుంది. తెలంగాణలో మొత్తం 404 కేసులు నమోదయ్యాయి. ఏపీలోని రెండు జిల్లాలలో మాత్రం ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం సంతోషించాల్సిన విషయం. ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదు. అయినా సరే అక్కడ ప్రజలు ఏ మాత్రం అలసత్వం వహించకుండా కరోనా వ్యాప్తి కట్టడికి ప్రకటించిన లాక్ డౌన్ ను విధిగా పాటిస్తున్నారు. అధికారుల ద్వారా సేకరించిన సమాచారం మేరకు... శ్రీకాకుళం జిల్లాలో విదేశాల నుండి వచ్చిన వారు 1445 మంది ఉన్నారు. ఇందులో 1439 మంది 14 రోజుల పాటు క్వారంటైన్ ను పూర్తి చేసుకున్నారు. 6 గురు ఇంకా క్వారంటైన్ లో ఉన్నారు. మొత్తం 279 నమూనాలను సేకరించి పరీక్ష చేయగా అందులో 137 నెగిటివ్ అని తేలింది. మిగతా 142 నమూనా ఫలితాలు రావాల్సి ఉంది. ఢిల్లీలో జరిగిన తబ్లిక్ జమాత్ సదస్సుకు ఈ జిల్లా నుండి ఒక్కరు కూడా వెళ్లలేదు. ఇక విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు. జమాత్ సదస్సుకు ఈ జిల్లా నుంచి ముగ్గురు మాత్రమే వెళ్లారు. వైద్యులు వీరి నమూనాలను పరీక్షలకు పంపించగా ఫలితాలు నెగెటివ్ రావడం జరిగింది. కరోనా అనుమానిత లక్షణాలున్న 17 మంది నమూనాలను రోగనిర్ధారణ పరీక్షల కోసం కాకినాడకు పంపించారు. ఇందులో 14 నమూనాలకు సంబంధించి నెగెటివ్ అని తేలింది. మరో మూడింటి ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసు నమోదు కాకపోయినప్పటికీ ఈ రెండు జిల్లాల్లో అధికార యంత్రాంగంతో పాటు ప్రజలు అన్ని రకాల జాగ్రత్త పాటిస్తున్నారు.