ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏప్రిల్ 15 నుంచి రైళ్ల పునరుద్దరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 04, 2020, 01:30 PM

దేశంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన 21 రోజుల లాక్‌డౌన్ కొనసాగుతోంది. వైరస్ వ్యాప్తిచెందకుండా దేశవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థను నిలిపివేశారు. కేవలం సరుకు రవాణ రైళ్లు తప్ప ప్రయాణికులు రైళ్లు నిలిచిపోయాయి. కేంద్రం విధించిన లాక్‌డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుండగా... ఏప్రిల్ 15 నుంచి రైలు సర్వీసులు ప్రారంభించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. రైల్వే భద్రత సిబ్బంది, రన్నింగ్ స్టాఫ్, గార్డ్స్, టీటీఈలు సహా ఇతర అధికారులు ఏప్రిల్ 15 నుంచి విధుల్లో చేరాలని ఆదేశాలు అందినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసి మంత్రుల బృందం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే రైల్వే సర్వీసులు ప్రారంభమవుతాయి.


ఇదిలా ఉండగా, రైళ్ల షెడ్యూల్, వాటి ఫ్రీక్వెన్సీ తదితర అంశాల గురించి అన్ని జోన్లకు పునరుద్ధరణ ప్రణాళికను రైల్వే శాఖ జారీ చేసింది. రైలు సర్వీసులను నడిపేందుకు సిద్ధంగా ఉండాలని దేశంలోని 17 జోన్లకు ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. రాజధాని, శతాబ్ది, దురంతో సహా దాదాపు 80 శాతం రైళ్లు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటితోపాటు లోకల్ రైళ్లు కూడా నడపనున్నారు.


 


కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్రం సూచనలతో ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలను రైల్వే శాఖ నిర్వహించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏప్రిల్ 14 వరకు రైళ్లు నిలిపివేయాలని గతంలో ఆదేశాలు జారీచేశారని, కొత్తగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదని ఉన్నతాధికారులు తెలిపారు. కాబట్టి ఏప్రిల్ 15 నుంచి రైలు సర్వీసులు ప్రారంభమవుతాయని అన్నారు. అయితే, రైలు సర్వీసుల పునరుద్దరణపై స్పష్టమైన కార్యాచరణను వచ్చేవారం ప్రకటించే అవకాశం ఉందన్నారు.


 


మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా అన్ని ప్యాసింజర్ రైళ్లను మార్చి 24 నుంచి నిలిపివేశారు. దీంతో మొత్తం 13,523 ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు స్టేషన్లకే పరిమితమయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com