దేశంలో గత వారం రోజుల్లోనే కరోనా కేసులు, మరణాలు నాలుగు రెట్లు పెరిగాయి. మార్చి 27 నాటికి కరోనా బాధితుల సంఖ్య 724, మరణాలు 17 ఉండగా శుక్రవారం నాటికి 2,983కిపైగా కేసులు, 84 మరణాలు నమోదయ్యాయి. ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ మత సమ్మేళనంలో పాల్గొన్న వారి ద్వారా వైరస్ చాపకింద నీరులా వ్యాపించడమే దీనికి కారణంగా తెలుస్తున్నది. గురువారం నుంచి శుక్రవారం వరకు 24 గంటల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో 380 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దీంతో వైరస్ సోకిన వారి సంఖ్య 2,983కు, మృతుల సంఖ్య 84కు పెరిగినట్లు పేర్కొన్నారు. కరోనా లక్షణాలున్న వారిని గుర్తించేందుకు మహారాష్ట్రలో 9 లక్షల మందిని సర్వే చేశారు. దేశవ్యాప్తంగా కరోనా పరీక్ష ల్యాబ్స్ సంఖ్య 180కి చేరినట్టు ఐసీఎంఆర్ తెలిపింది. గత 24 గంటల్లో దాదాపు తొమ్మిదివేల మందికి పరీక్షలకు నిర్వహించినట్లు వెల్లడించింది. ఢిల్లీ వంటి నగరాల్లో ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ నిర్వహించాలని కేంద్రం సూచించింది. దేశంలో ఎలాంటి మందుల కొరత లేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్ తెలిపారు. పది కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల సరఫరాకు ఆర్డర్ ఇచ్చినట్లు చెప్పారు. ఐదు రోజుల్లో 15.4 టన్నుల వైద్య సామగ్రిని పలు రాష్ట్రాలకు తరలించామన్నారు. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాలకు కేంద్రం రూ. 17,287 కోట్లు విడుదల చేసింది. మరోవైపు ప్రపంచ బ్యాంకు భారత్కు సాయాన్ని ప్రకటించింది.