-ప్రాక్టికల్ టాక్సేషన్ కోసం జీఎస్టీలో పోరాడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
-మంత్రి ఈటెల వినతి
హైదరాబాద్, సూర్య ప్రధానప్రతినిధి : ప్రభుత్వం విధించిన పన్నులు చెల్లించి న్యాయబద్దంగా సంపాదిం చండీ ఆత్మగౌరవంతో బతకండీ అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆల్ ఇండియా జెమ్స అండ్ జ్యూవెలరీ ట్రేడ్ ఫెడరేషన్ సభ్యులను కోరారు. ఆదివారంనాడు ఆల్ ఇండియా జెమ్స అండ్ జ్యూవెలరీ ట్రేడ్ ఫెడరేషన్ సభ్యులు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా న్యాయబద్ధంగా సంపాదించండి, ఆత్మగౌరవంతో బతకండి అని వ్యాపారస్తులను మంత్రి కోరారు. తర్వాత పన్నుల విధానంలో గందరగోళం ఉండదని, పారదర్శకత పెరుగుతుందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రస్తుతం జెమ్స అండ్ జ్యూవెలరీ ఇండస్ట్రీ దేశంలో మూడు లక్షల కోట్ల వ్యాపారం చేస్తోంది. జీడీపీలో ఆరు శాతం వాటా కలిగి ఉంది. ప్రోత్సాహం అందిస్తే మరింత వాటాను దక్కించుకుంటామని, 1.25శాతం పన్ను ఉండేలా జీఎస్టీలో తమ తరపున నివేదించాలని ఫెడరేషన్ సభ్యులు మంత్రిని కోరారు. ఇప్పటివరకు జరిగిన చర్చల్లో 4శాతం పన్ను విధించేందుకు కేంద్రం ఆలోచిస్తుందని మంత్రి తెలిపారు. ఎక్కువ మంది పన్నులు చెల్లించాలి, ఎక్కువ లావాదేవీలు జరగాలి. జీరో దందా బంద్ కావాలి అనేది తమ లక్ష్యమని మంత్రి అన్నారు. అశాస్త్రీయంగా, అడ్డగోలుగా పన్నులు విధించడం వల్ల ఎక్కువ మంది పన్ను ఎగ్గొడుతున్నారు. దొంగదారులు వెతుక్కుంటున్నారు.