జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంచి మనసు చాటుకున్నారు. గురువారం ఉదయం ఢిల్లీ వెళ్లిన పవన్.. అమర సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని జనసేన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే సందర్భంగా.. సైనికుల కుటుంబాల కోసం కోటి రూపాయలు విరాళంగా ఇస్తానని డిసెంబర్ 6, 2019న పవన్ కళ్యాణ్ ప్రకటించారు. స్వయంగా తానే విరాళాన్ని అందిస్తానని మాటిచ్చారు. అన్నమాట ప్రకారం పవన్ నేడు (ఫిబ్రవరి 20న) చెక్కును అందజేశారు.
కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించి.. సైనికాధికారులకు విరాళాన్ని అందజేసిన అనంతరం.. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు విజ్ఞాన్ భవన్లో జరగనున్న ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఆయన కీలకపోన్యాసం చేయడంతోపాటు.. విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. పవన్ గురించి రూపొందించిన షార్ట్ ఫిల్మ్ను ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. ఈ సదస్సులో కేంద్ర మంత్రి స్మృతి ఇరాని, కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా కూడా పాల్గొంటారు.