తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు ఎస్బీఐ బంపర్ ఆఫర్ ప్రకటించింది. నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడమే కాకుండా ఫ్రీగా ఫుడ్డు.. బెడ్డుతో పాటు ట్రైనింగ్ పూర్తయ్యాక వ్యాపారానికి కూడ లోన్ ఇవ్వనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. బ్యాంకులు ఇలా కూడ చేస్తాయని అనుకుంటున్నారా..? ఇది అక్షరాల నిజం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న మధ్యతరగతి కుటుంబాల్లోని నిరుద్యోగులతో పాటు ఉన్నత విద్యను చదవలేని వారి కోసమే ఎస్బీఐ ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి వారికి బాసటగా నిలవాలన్నదే ఎస్బీఐ కాన్సెప్ట్ అని తెలుస్తోంది.
ఇప్పటికే దేశ వ్యాప్తంగా 587 శిక్షణా సంస్థలను ఎస్బీఐ ప్రారంభించింది. తాజాగా మరో 151 సంస్థలను ప్రారంభించబోతుంది. ఉపాధి లేక బాధపడుతోన్న యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడమే కాకుండా ఫ్రీగా భోజన సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నది. ట్రైనింగ్ తర్వాత వ్యాపారం కోసం, ఉద్యోగం కోసం అవకాశాలు కూడా ఎస్బీఐ కల్పిస్తోంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
ఆయా జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో దరఖాస్తు చేసుకోవాలి. స్థానికంగా ఉన్న ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ని కలిసి శిక్షణ సంస్థ వివరాలు తెలుసుకోవచ్చు. ఈ శిక్షణ పొందేందుకు అర్హతలేంటంటే.. 18 నుంచి 31 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. 10వ తరగతి పాసయిన వారి దగ్గరి నుంచి పీజీ చేసిన వారంతా అర్హులేనని ఎస్బీఐ స్పష్టం చేసింది. ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలతో పాటు తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి.. ఆధార్ కార్డ్, 3 పాస్ పోర్టు సైజ్ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.