ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ముదిరిన శాసనమండలి ఫైట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2020, 12:43 PM

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సెలెక్ట్ కమిటీల ఏర్పాటు ఇప్పట్లో సాధ్యమయ్యేట్టు కనిపించడంలేదు. సెలెక్ట్ కమిటీల ఏర్పాటు కోసం అసెంబ్లీ కార్యదర్శికి మండలి నుంచి వెళ్లిన ఫైల్ ఇప్పటికే ఒకసారి తిరస్కరణకు గురైంది. తాజాగా, మండలి చైర్మన్ మరోసారి ఫైల్ పంపగా, అసెంబ్లీ కార్యదర్శి రెండోసారి కూడా వెనక్కి పంపారు. నిబంధనల ప్రకారం సెలెక్ట్ కమిటీల ఏర్పాటు సాధ్యం కాదని అసెంబ్లీ కార్యదర్శి స్పష్టం చేశారు. ఈ మేరకు శాసనమండలి చైర్మన్ కు అసెంబ్లీ కార్యదర్శి నోట్ పంపారు.
ఇదే సమయంలో ఏపీ అసెంబ్లీ, శాసనమండలి ప్రోరోగ్‌ అయ్యాయి. ఉభయసభలను ప్రోరోగ్‌ చేస్తూ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఉభయసభలను ప్రోరోగ్‌ చేసిన నేపథ్యంలో వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఆర్డినెన్స్‌ తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. బిల్లులు శాసనమండలి ముందున్నా.. సభలను ప్రోరోగ్‌ చేస్తే ఆర్డినెన్స్‌ జారీకి సాంకేతిక ఇబ్బందులు ఉండవని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఆర్డినెన్స్ ద్వారా ఈ రెండు బిల్లులు ఆమోదించి.. కార్యాలయాలను విశాఖకు తరలించాలని భావిస్తోంది. మార్చి 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
బడ్జెట్ సమావేశాల తర్వాత విశాఖ నుంచే పాలన కొనసాగుతోందని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఆ దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో మార్చిలో విశాఖ నుంచి పాలన కొనసాగించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. దీంతో ఈ నెలఖారులోగా అర్డినెన్స్ తీసుకురావచ్చని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com