ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1,600 దాటేసిన కోవిడ్ మృతులు

international |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2020, 09:37 AM

కోవిడ్ 19ను నిరోధించడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలించడంలేదు. ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కరోనా వైరస్ కారణంగా శనివారం 143 మంది మృతిచెందగా, మరో 2,641 కొత్త కేసులు నమోదైనట్టు చైనా ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. హుబే ప్రావిన్సుల్లోని 56 మిలియన్ల జనాభా నిర్బంధం కొనసాగుతోంది. ఈ ప్రావిన్సుల్లోని ప్రజలతో దేశంలోని మిగతా ప్రాంతాలతో సంబంధాలు దాదాపుగా నిలిచిపోయాయి. తాజా మరణాలతో కరోనా మృతుల సంఖ్య 1,600కు చేరింది. 66,000 మందికిపైగా బాధితుల ఉన్నట్టు తేలింది. వుహాన్ నగరంలో గతేడాది డిసెంబరు చివరిలో వెలుగుచూసిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచంలోని మొత్తం 28 దేశాలకు విస్తరించింది.


శనివారం నాడు ప్రాణాలు కోల్పోయిన 143 మంది హుబే ప్రావిన్సులకు చెందినవారేనని అధికారులు పేర్కొన్నారు. దాదాపు 20 రోజుల నుంచి హుబే ప్రావిన్సుల్లోని పలు నగరాల్లో ప్రజా రవాణ పూర్తిగా నిలిపివేశారు. చైనా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, పలు సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసుకునేలా వెసులుబాటు కల్పించాయి. అతి కొద్ది శాతం మంది మాత్రమే ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు.


కరోనా కేసులను గుర్తించడానికి అధికారులు ప్రమాణాలను మార్చడంతో ఈ వారంలో బాధితుల సంఖ్య బాగా పెరిగింది. వైరస్ కొత్తగా వేలాది మందికి సోకినట్టు గుర్తించారు. రక్త నమూనా పరీక్షలలో పాజిటివ్‌గా వచ్చిన వారికి సీటీ స్కాన్ ఇమేజింగ్ ద్వారా ఊపిరితిత్తులను పరిశీలించి కేసులను ధ్రువీకరిస్తున్నారు. దాదాపు 15 వేల మంది కొత్తగా కరోనా వైరస్ బారినపడినట్టు అధికారులు గురువారం ప్రకటించగా, వాటిని మళ్లీ సవరించారు. కిందటి వారాల్లో కేసులను కలిపి లెక్కించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.


 


శుక్రవారం 4,800 కేసులు, శనివారం 2,420 కేసులు నమోదైనట్టు తెలిపారు. హుబే ప్రావిన్సులు వెలుపల కొత్తగా వైరస్ సోకిన కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇక, కరోనా వైరస్ 1,761 మంది వైద్యులు, నర్సులకు సోకిందని, వీరిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని చైనా అధికారులు శుక్రవారం ప్రకటించారు. వైరస్ బారినపడ్డ వైద్య సిబ్బంది అధికంగా వుహాన్ నగరంలోనే ఉన్నారు. వైరస్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని బాధితులకు చికిత్స అందజేస్తున్నా మహమ్మారి నుంచి కొందరు తప్పించుకోలేకపోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com