అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ హైకోర్టులో ఏపీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. జగన్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐను హైకోర్ట్ ఆదేశించింది. అయితే కౌంటర్ దాఖలుకు కొంత సమయం కావాలని గత వారం సిబిఐ కోరడంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది. సీబీఐ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత హై కోర్టు విచారణ జరిపి తీర్పు ఇవ్వనున్న నేపధ్యంలో సీబీఐ కౌంటర్ పై ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసు విచారణ సిబిఐ కోర్టులో ప్రతి శుక్రవారం జరుగుతోంది. ప్రధానంగా ఈ నెల 6వ తేదీన దీనికి సంబంధించి విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ సీబీఐ సరైన టైమ్ లో కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో విచారణ ఈ నెల 12 కు వాయిదా వేయడంతో సిబిఐ అధికారులు ఏదైతే కౌంటర్ దాఖలు చేస్తారో ఆ కౌంటర్ లో ఎటువంటి విషయాలు పొందుపరుస్తారనేది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
జగన్ అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు దానిని కొట్టివేసిన నేపధ్యంలో హైకోర్టును ఆశ్రయించి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తనకు ప్రతి వారం కోర్ట్ కు హాజరు కావాలంటే దాదాపు 60 లక్షల రూపాయల ఖర్చవుతుందని జగన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం మీద నేడు దాఖలయ్యే కౌంటర్ పై సర్వత్రా ఉత్కంఠత నెలకొన్నది.