స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియాకు ఐసీసీ షాకిచ్చింది. శుక్రవారం వెల్లింగ్టన్లో న్యూజిలాండ్తో జరిగిన నాలుగో టీ20లో తమ ఓవర్లను సమయానికి పూర్తి చేయనందుకు గాను టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ నిర్దేశించిన సమయంలో 20 ఓవర్లు వేయాల్సి ఉండగా రెండు ఓవర్లు ఆలస్యంగా వేశారు. ఐసీసీ ప్రవర్తనా నియమావళి యొక్క ఆర్టికల్ 2.22 ప్రకారం మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ ఒక్కో ఓవర్కు 20 శాతం చొప్పున మొత్తం 40 శాతం జరిమానా విధించారు. కోహ్లీ సైతం తన తప్పిదాన్ని అంగీకరించాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్లు క్రిస్ బ్రౌన్ మరియు షాన్ హేగ్లతో పాటు థర్డ్ అంపైర్ ఆష్లే మెహ్రోత్రా టీమిండియాపై స్లో ఓవర్ రేట్ అభియోగాలు నమోదు చేశారు. ఈ అభియోగాలను కెప్టెన్ విరాట్ కోహ్లీ అంగీకరించడంతో ఎలాంటి విచారణ ఉండదని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. నాలుగో టీ20లో టీమిండియా మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ సిరీస్లో వరుసగా రెండోసారి సూపర్ ఓవర్ ఆడటం జరిగింది. అచ్చం మూడో టీ20ని తలపించే విధంగా నాలుగో టీ20లో కూడా టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ మరొకసారి ఉత్కంఠ భరితంగా మారింది. అయితే, సూపర్ ఓవర్లో న్యూజిలాండ్ 14 పరుగుల టార్గెట్ను నిర్దేశించగా, దాన్ని టీమిండియా సునాయాసంగా ఛేదించింది. దీంతో ఈ రెండు మ్యాచ్ల్లోనూ టీమిండియానే విజయం సాధించింది. ఫలితంగా ఐదు టీ20ల సిరిస్లో టీమిండియా 4-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య ఐదో టీ20 ఆదివారం మౌంట్ మాంగనూయి వేదికగా జరగనుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 165 పరుగులు చేయగా, న్యూజిలాండ్ కూడా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 165 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యింది. దీంతో మ్యాచ్ విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ ఆడించారు. సూపర్ ఓవర్లో విజయం కోహ్లీసేననే వరించింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ వికెట్ కోల్పోయి 13 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా వికెట్ కోల్పోయి ఓ బంతి మిగిలి ఉండగానే 16 పరుగులు చేయడంతో ఈ మ్యాచ్లో విజయం సాధించింది.