మూడు రాజధానుల ప్రతిపాదనను ఎప్పుడైతే సీఎం జగన్ ప్రకటించారో అప్పటి నుంచి రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాజధాని మార్పు వ్యవహారం కాస్తా ఏకంగా శాసనమండలి రద్దు వరకు వెళ్లింది. గత 40 రోజులుగా ఏపీ అట్టుడుకుతోంది. ఇటువంటి తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు మండలి చైర్మన్ షరీఫ్ లతో వేర్వురుగా ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సమావేశమయ్యారు. రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిన వ్యవహారంలో శాసనసభతో పాటు మండలిలో జరిగిన పరిణామాలపై గవర్నర్ ఆరా తీసినట్లు సమాచారం. అసెంబ్లీ, కౌన్సిల్ లో జరిగిన పరిణామాలను తమ్మినేని, షరీఫ్ లు గవర్నర్ కు వివరించినట్లు తెలుస్తోంది. మండలి రద్దుపై రేపు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్న తరుణంలో గవర్నర్ బిశ్వభూషణ్ ఎంటర్ కావడం రాజకీయ వర్గాల్లో అసక్తి రేపుతోంది.