కోడలిని కూతురిలా చూసుకోవాల్సిన మామ ఆమె పై మోజుతో లైంగికంగా వేధించాడు. వివాహేతర సంబంధానికి ఆమె ఒప్పుకోకపోవడంతో కత్తితో దాడి చేసి ఆమెను హత్య చేశాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
కర్ణాటకలోని హసన్ జిల్లాకు చెందిన వీణకు మాండ్య జిల్లా రాగిముద్దనహళ్లికి చెందిన నాగరాజు కుమారుడు అనిల్ తో వివాహమైంది. అనిల్, వీణ దంపతులకు ఇద్దరు పిల్లలు. వీరి కాపురం సజావుగానే సాగుతుంది. రెండు సంవత్సరాల క్రితం నాగరాజు భార్య సావిత్రమ్మ అనారోగ్యంతో చనిపోయింది. ఆ తర్వాత నాగరాజు మనస్సు ఇంట్లో ఉన్న వీణ పై పడింది. కొడుకు భార్య అని కూడా మర్చిపోయి కూతురిలా చూసుకోవాల్సిన వీణను లైంగికంగా వేధించాడు. తన కోరిక తీర్చాలని కోరాడు. ఇందుకు వీణ నిరాకరించింది. భర్తతో చెబితే పరువుపోతుందేమోనని ఓపిక పట్టింది.
కానీ అనిల్ ఇంట్లో లేని సమయంలో నాగరాజు వీణను వేధించేవాడు. అసభ్యకర మాటలతో ఆమెను ఇబ్బంది పెట్టాడు. దీంతో వేధింపులు భరించలేని వీణ తన భర్త అనిల్ కు విషయం చెప్పింది. దీంతో అనిల్ తన తండ్రి నాగరాజును హెచ్చరించాడు. అయినా నాగరాజులో మార్పు రాలేదు. దీంతో అనిల్ తన భార్య పిల్లలతో కలిసి గ్రామంలోనే వేరే ఇల్లు కిరాయి తీసుకొని నివాసం ఉంటున్నాడు. అయినా మారని నాగరాజు షాపుకు వెళుతున్నట్టుగా నటించి వీణ కిరాయికి ఉంటున్న ఇంటి సైడ్ వెళ్లేవాడు. అసభ్య మాటలు అంటూ బజార్లోనే మొత్తుకునేవాడు.
దీంతో అనిల్ పోలీసులకు తన తండ్రి పై ఫిర్యాదు చేశాడు. నాగరాజు ఇటీవలే ఈ కేసు విషయమై జైలుకు వెళ్లి బెయిల్ పై వచ్చాడు. అయినా అతనిలో మార్పు లేదు. మళ్లీ వీణను వేధించాడు. ఓ వైపు వీణ వివాహేతర సంబంధానికి ఒప్పుకోకపోవడం మరో వైపు జైలుకు పంపించడంతో నాగరాజు కక్ష పెంచుకున్నాడు. వీణను హత్య చేయాలని ప్లాన్ చేసి తన తమ్ముడు మంజు సహకారం తీసుకున్నాడు.
ఆదివారం ఉదయం నుంచి వీణ నివాసం ఉంటున్న ఇంటి వద్ద రెక్కీ నిర్వహించాడు. వీణ పని నిమిత్తం ఇంట్లో నుంచి బయటికి రాగానే ఒక్కసారిగా పరిగెత్తి ఆమె గొంతు పై, కడుపులో కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. వీణ కేకలు విని అనిల్ ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు. చుట్టు పక్కన ఉన్నవారు కూడా అలర్ట్ అయి వచ్చే లోపు వీణ రక్తపు మడుగులో పడిపోయింది. ఇంతలో నాగరాజు, మంజు బైక్ పై పరారయ్యారు. వీణను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయింది. ఈ ఘటనతో అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి. దీని పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.